‘యాప్ గురించి తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇప్పియి’
చేగుంటలో మహిళా రైతు ఆవేదన
చేగుంట (మెదక్): "నాకు యూరియా యాప్ గురించి ఏమీ తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా, ఎట్లనైనా యూరియా ఇప్పించండి" అంటూ ఒక మహిళా రైతు మండల వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకున్న హృదయవిదారక సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
యూరియా బస్తాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేగుంటకు చెందిన నర్సవ్వ అనే మహిళా రైతు, శనివారం యూరియా కోసం వ్యవసాయ అధికారి వద్దకు వెళ్లి తన బాధను వెల్లబోసుకుంది. డిజిటల్ లేదా యాప్ విధానంలో యూరియా పొందే ప్రక్రియపై తనకు ఎలాంటి అవగాహన లేదని, పంట కాపాడుకోవడానికి ఎట్లయినా యూరియా ఇప్పించాలని కోరుతూ అధికారి కాళ్లపై పడింది.
ఈ సందర్భంగా నర్సవ్వ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తే ఇంటికే యూరియా బస్తాలు తెచ్చి ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు యూరియా కోసం ఇట్లా అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది" అని ఆవేదన చెందింది.
సామాన్య, నిరక్షరాస్య రైతులకు ఈ యాప్ల విధానం ఇబ్బందికరంగా మారిందని, క్షేత్రస్థాయిలో యూరియా పంపిణీని సులభతరం చేసి రైతులకు నేరుగా అందేలా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు.