విధాన స్తబ్దత నుంచి విధాన చైతన్యం వరకు భారత్ ఎంతో దూరం ప్రయాణించింది
ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:2013 నాటి విధాన స్తబ్దత (Policy Paralysis) నుంచి దేశం నేడు విధాన చైతన్యం (Policy Action) వైపు ఎంతో దూరం ప్రయాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 13 ఏళ్ల క్రితం (2013లో) గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఇక్కడ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ, అప్పటి ప్రతికూల పరిస్థితుల నుంచి భారత్ నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని చెప్పారు.
ఒకప్పుడు భారత్ను 'ఫ్రాజైల్ 5' (అత్యంత బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలు) అని పిలిచేవారని, కానీ నేడు ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా దేశం 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించిందని ప్రధాని గుర్తుచేశారు. నాడు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన వారు ఈ వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
2013లో అవినీతి, కుంభకోణాలు, ఉగ్రవాద సవాళ్లతో దేశం సతమతమయ్యేదని, కానీ నేడు ఉగ్రవాదులు చిత్తుగా ఓడిపోయారని ప్రధాని అన్నారు. సరిహద్దుల్లో దుశ్చర్యలకు పాల్పడితే భారత సైన్యం వారి సొంత గడ్డపైకి దిగి మరీ దెబ్బకొడుతోందని, నక్సలిజం నడుము విరిగిందని స్పష్టం చేశారు.
ఎస్ఆర్సీసీ తరతరాల మేధావులను తీర్చిదిద్దిందని ప్రశంసిస్తూ, ఇక్కడి పూర్వ విద్యార్థులను 'ఓజీ'లు (Original Gangsters/OGs) అని సంబోధించి యువతను ఆకట్టుకున్నారు. సంస్థ 100 సంవత్సరాల ప్రస్థానానికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక రూ. 100 స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. (అంతకుముందు ఏప్రిల్లో ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు).
ఈ సందర్భంగా నాటి వార్తాపత్రికల ముఖ్యాంశాలను పరిశీలించాలని ప్రధాని యువతకు సూచించారు. నాటి ఆశాహీన వాతావరణం నుంచి నేటి ఆశావాద భారత్ వరకు సాధించిన పురోగతిపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.