మందమర్రి తహసీల్దార్పై హత్యాయత్నం!.. వెంటాడి దాడికి యత్నించిన గుర్తుతెలియని దుండగులు..! రెవెన్యూ వర్గాల్లో కలకలం..
01 సూర్య మందమర్రి:
మందమర్రి మండల మేజిస్ట్రేట్ పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి విధులు ముగించుకుని వెళ్తున్న మండల తహసీల్దార్ పనగంటి సతీష్ కుమార్ శర్మ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి యత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వాహనాన్ని వెంబడించినట్లు, అనంతరం ఇంటి వద్ద అర్ధరాత్రి దాటి ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల వరకు ఇంటి వద్దే అనుమానాస్పదంగా సంచరించినట్లు సమాచారం. తహసీల్దార్ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించడానికి అసలు కారణమేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూ మాఫీయానా, వ్యక్తిగత కక్షలే కారణమా, లేక రెవెన్యూ వ్యవహారాల్లో తలెత్తిన వివాదమేనా? అనే కోణాల్లో పూర్తి దర్యాప్తు సాగాల్సి ఉంది. ఈ ఘటనతో రెవెన్యూ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అధికారిపైనే దాడికి యత్నించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పలువురు పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి దుండగులను గుర్తించి, దాడి వెనుక ఉన్న అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారుల భద్రతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. తహసీల్దార్పై దాడికి యత్నించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ వర్గాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.