ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా క్షిపణి దాడులు
హెచ్చరిక జారీ చేసిన సెంట్రల్ కమాండ్
వాషింగ్టన్/దుబాయ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పరాకాష్టకు చేరాయి. తమ యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడానికి యత్నించినందుకు ప్రతికారంగా ఇరాన్కు చెందిన మూడు చమురు ట్యాంకర్లను నాశనం చేసినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ (CENTCOM) శనివారం అధికారికంగా ప్రకటించింది. గత వారం రోజులుగా ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తిరిగి ప్రారంభం కాగా, తాజా చర్యతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమత్యాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఇరాన్ సైనిక బలగాలైన ఐఆర్జిసి (IRGC)కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "మీరు మా రెండు నౌకలపై కాల్పులు జరిపితే, మేం మీ మూడు నౌకలను ధ్వంసం చేసి, అంతకంటే అధిక ఆర్థిక మూల్యం చెల్లించేలా చేస్తాం. అమెరికా దళాల రక్షణకు వెనుకాడేది లేదు, అవసరమైతే ఇరాన్ యొక్క బలహీనమైన చమురు నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేస్తాం" అని స్పష్టం చేశారు. ధ్వంసమైన ఈ మూడు చమురు ట్యాంకర్లు ఐఆర్జిసి మరియు దాని ప్రాంతీయ ప్రాక్సీ (ఉగ్రవాద) గ్రూపులకు బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులు సమకూర్చే రహస్య నెట్వర్క్లో భాగంగా ఉన్నాయని సెంట్ కామ్ వివరించింది.
హోర్ముజ్ జలసంధిలో నావికా మందుపాతరలను అమర్చకుండా నిరోధించేందుకు రాకెట్ లాంచర్లపై అమెరికా దాడి చేయడంతో గత ఆదివారం నుండి పోరాటం మళ్లీ మొదలైంది. అనంతరం అమెరికా మరో తీవ్రమైన దాడి చేసిందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా వైమానిక దాడులకు నిరసనగా ఇరాన్ కూడా ఈ ప్రాంతంలోని యూఏఈ (UAE), బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపై ప్రతీకార దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.