ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ సడన్ సర్ ప్రైజ్
విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యేందుకు శనివారం వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సాధారణ ప్రయాణికుడిలా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్రావెల్ కార్డుతో మెట్రో స్టేషన్ గేట్ వద్ద పంచ్ చేసి ఎల్లో లైన్ కోచ్లోకి ప్రవేశించిన ప్రధానిని చూసి తోటి ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు అవాక్కయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయాణంలో, మోదీ విద్యార్థులు మరియు మహిళా ప్రయాణికుల మధ్య కూర్చొని ఆప్యాయంగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించడం ఇది మొదటిసారి కాదు. 2015లో ఫరీదాబాద్ ఎక్స్టెన్షన్ లైన్ ప్రారంభోత్సవం, 2023లో ఢిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు, అలాగే 2026 ఫిబ్రవరిలో మీరట్ మెట్రోలోనూ ఆయన సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. మెట్రో ప్రయాణం అనంతరం జరిగిన ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రసంగించారు. దేశ ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న రక్షణ ఎగుమతులు, నక్సలిజం అంతం, నూతన పార్లమెంట్ భవనం, కోవిడ్-19 పై పోరాటం వంటి విజయాలను వివరించారు.
తిరోగమన మనస్తత్వం, అరాచకవాద పోకడలు ఉన్న వ్యక్తుల అసలు స్వరూపాన్ని పౌరులు గుర్తిస్తున్నారని పేర్కొంటూ ప్రధాని మోదీ మరోసారి 'దిమాగీ నక్సల్' అనే పదాన్ని ఉపయోగించి విమర్శలు గుప్పించారు. ఎస్ఆర్సీసీ వ్యవస్థాపకులు, ప్రముఖ దాత సర్ శ్రీ రామ్కు ప్రధాని నివాళులర్పించారు. "ఒక వ్యక్తి నూరేళ్లు జీవిస్తే అనుభవాల సంపద అవుతాడు.. అదే ఒక సంస్థ శతాబ్ది పూర్తి చేసుకుంటే అది విజయాల సముద్రంగా మారుతుంది" అని కొనియాడారు.