ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం
16 స్టేషన్లకు విస్తరించిన నెట్వర్క్
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2ను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు కూడా పాల్గొన్నారు.
ఫేజ్-I (రీచ్-II) కింద నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ కారిడార్, సూపర్ కారిడార్-3 నుండి మాల్వీయ నగర్ చౌరహా వరకు సుమారు 11 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. రూ. 2,850 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ మార్గంలో 11 నూతన స్టేషన్లు ఉన్నాయి.
ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో ఇండోర్ మెట్రో నెట్వర్క్ మొత్తం 17 కిలోమీటర్ల మేర 16 స్టేషన్లకు విస్తరించింది. దీంతో ఇప్పటివరకు ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 4,370 కోట్లకు చేరింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ మాట్లాడుతూ, విస్తరించిన ఈ మెట్రో మార్గం నగర నివాసితులకు వేగవంతమైన, సురక్షితమైన మరియు నమ్మకమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుందన్నారు. ప్రధాన నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు మరియు ఉపాధి కేంద్రాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మెట్రో వ్యవస్థల వల్ల వాహనాల రద్దీ, పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించిన మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇంజనీర్లు, అధికారులు మరియు కార్మికులను ఈ సందర్భంగా మంత్రులు అభినందించారు.