జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ గుండెపోటుతో అకాల మరణం
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం హేమంత్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ కేబినెట్ మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నాయకుడు సుదివ్య కుమార్ సోను (56) ఆదివారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఒక కీలక నాయకుడిని అకస్మాత్తుగా కోల్పోవడంతో జేఎంఎం పార్టీ సహా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
గిరిదిహ్లోని తన నివాసంలో నిద్రిస్తుండగా సుదివ్య కుమార్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గిరిదిహ్ సదర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత & సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటకం, పర్యాటక-క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదివ్య కుమార్ మరణం పట్ల సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన తనకు కేవలం రాజకీయ సహచరుడే కాక కష్టకాలంలో అండగా నిలిచిన సొంత అన్నయ్య లాంటివారని సోరెన్ గుర్తు చేసుకున్నారు.
2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన కుమార్, గతంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ సమయంలో ఎదురైన రాజకీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం పార్టీకి, రాష్ట్రానికి "తీరని లోటు" అని జేఎంఎం వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే పర్యాటక రంగ అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు కర్ణాటక పర్యటనకు వెళ్లిన ఆయన, తిరిగి వచ్చిన కొద్ది రోజులకే అకస్మాత్తుగా మరణించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.