పెంటగాన్ లీక్ల కలకలం
50 మంది సైనికాధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు
వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలో ఇరాన్తో యుద్ధం, అమెరికా వద్ద కీలక ఆయుధ నిల్వలు తగ్గిపోవడం వంటి సున్నితమైన అంశాలు మీడియాకు లీక్ కావడంపై పెంటగాన్ తీవ్రంగా స్పందించింది. రహస్య సమాచారాన్ని పాత్రికేయులకు చేరవేస్తున్నారనే అనుమానంతో దర్యాప్తు అధికారులు తమ సైనిక 'జాయింట్ స్టాఫ్'లోని సుమారు 50 మంది అధికారులు, పౌర సిబ్బందికి పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించినట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదించింది.
పశ్చిమ ఆసియా యుద్ధ వాతావరణంలో దీర్ఘశ్రేణి క్షిపణులు, పేట్రియాట్ ఇంటర్సెప్టర్ల కొరతపై వరుస వార్తలు రావడం వల్ల ఆగస్టులో ఈ పరీక్షలు చేపట్టారు. భవిష్యత్తులో అధికారులు సమాచారాన్ని లీక్ చేయకుండా నిరోధించడానికే ఈ అసాధారణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అంతర్గత దర్యాప్తులపై వ్యాఖ్యానించబోమని పెంటగాన్ ప్రతినిధి షాన్ పార్నెల్ స్పష్టం చేశారు. అయితే, జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచార లీకేజీని అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
సమాచారాన్ని లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులను ఆదేశించారు. ఆయుధాల కొరత, యుద్ధ నిర్వహణపై వచ్చిన కథనాలను ఆయన "దేశద్రోహపూరితమైనవి"గా అభివర్ణించారు. అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ వైఖరి వల్ల పెంటగాన్లో తీవ్ర అపనమ్మక వాతావరణం నెలకొందని అధికారులు చెబుతున్నారు. హెగ్సెత్ తన పదవీకాలంలో దాదాపు 80 మంది జనరల్స్, అడ్మిరల్స్ పదోన్నతులను అడ్డుకోవడం లేదా తొలగించడం వివాదాస్పదమైంది.
పెంటగాన్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని పరిమితం చేయడంతో పాటు, యుద్ధ వివరాలపై విలేకరుల సమావేశాలను తగ్గించారు. అంతేకాకుండా, యూఎస్ఎస్ అబ్రహం లింక్ నౌకలోని పరిస్థితులపై కథనం రాసినందుకు 'స్టార్స్ అండ్ స్ట్రైప్స్' పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ను ఇటీవల పదవి నుంచి తొలగించడం గమనార్హం.