ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం
కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, కీలక నేతల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అత్యవసరంగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో మరికాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశం ప్రాధాన్యత దృష్ట్యా కేసీ వేణుగోపాల్ తన నాసిక్ పర్యటనను సైతం రద్దు చేసుకోవడం గమనార్హం.
ఈ కీలక భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
సురేఖ వ్యవహారంపై ప్రత్యేక చర్చ?
ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన మంత్రి కొండా సురేఖ, నేత చిన్నారెడ్డిల వ్యవహారాలతో పాటు ప్రభుత్వ పాలన, పార్టీ అంతర్గత అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరగా, ఆమె మరికొద్ది సేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.
మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఢిల్లీలోనే విడిది చేశారు. మంగళవారం ఉదయమే స్పీకర్ గడ్డం ప్రసాద్ AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి పలు అంశాలపై మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం పూర్తయిన అనంతరం, నేతలందరూ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరగబోయే మరొక కీలక భేటీకి హాజరుకానున్నారు. అధిష్టానం పిలుపుతో ఈ భేటీలు జరుగుతుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.