మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత
మంత్రి శ్రీధర్ బాబు
225 మందికి రూ.50 వేల చొప్పున చెక్కుల పంపిణీ
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1):
మైనారిటీ మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 225 మంది మైనారిటీ మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
స్వయం ఉపాధి, చిన్నతరహా వ్యాపారాలకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడంతో పాటు మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మైనారిటీల జీవనోపాధి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.