వినాయక చవితి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ఏడాది నగరంలో ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 25వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఉత్సవాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
పండుగ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతి గణేష్ మండపానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, వరుసగా మూడో సంవత్సరం కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ఈ ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.