సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్.. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ భూవివాదంలో ప్రభుత్వ పిటిషన్ డిస్మిస్
సూర్య తెలంగాణ డెస్క్: హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హైడ్రా మరియు భూవివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి లోతుకుంట ప్రాంతంలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు సంబంధించిన భూమి వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం సర్వోన్నత కోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ వెలువడిన ఈ తీర్పు రాజకీయ మరియు అధికారిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో సర్వే నంబర్లు 1, 2 పరిధిలో సుమారు 40 ఎకరాల విలువైన భూమి ఉంది. ఈ భూమిపై గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రముఖ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య తీవ్రస్థాయిలో న్యాయపోరాటం కొనసాగుతోంది. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఈ 40 ఎకరాల భూమి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని వాదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టులు గతంలోనే స్పష్టతనిచ్చాయి. ఈ భూమి ప్రభుత్వానికి కాదని, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకే చెందుతుందని గతంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, దిగువ కోర్టు తీర్పులో ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. కాగా, ఇదే భూ వివాదానికి సంబంధించి గతంలో హైడ్రా తీరుపై కూడా న్యాయస్థానాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో ఇదే కేసు విచారణ సమయంలో హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ భూ వివాదం మరోసారి రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.