కోల్కతాలో సెమీకండక్టర్ విభాగం ప్రారంభం
కోల్కతా:పశ్చిమ బెంగాల్ను భవిష్యత్తు టెక్నాలజీ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కోల్కతాలోని సీఎస్ఐఆర్-సిజిసిఆర్ఐ (CGCRI)లో 'ఎమర్జింగ్ క్వాంటం అండ్ సెమీకండక్టర్ టెక్నాలజీస్' (EQST) విభాగాన్ని రాష్ట్ర మంత్రి కళ్యాణ్ చక్రబోర్తి సోమవారం ప్రారంభించారు. ‘క్వాంటం అండ్ సెమీకండక్టర్ టెక్నాలజీస్: ఇన్నోవేషన్స్ ఫర్ ది ఫ్యూచర్ (CQST-2026)’ జాతీయ సదస్సు సందర్భంగా ఆయన ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో భారత్ ప్రేక్షక పాత్రకే పరిమితం కాజాలదని, రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను, జాతీయ భద్రతను నిర్దేశించే శక్తి ఈ రంగానికి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటకల తరహాలోనే బెంగాల్ కూడా తన శాస్త్రీయ వారసత్వంతో సెమీకండక్టర్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారగలదని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కొత్త ఈక్యూఎస్టీ విభాగాన్ని జాతీయ క్వాంటం మిషన్తో అనుసంధానించాలని ఆయన సూచించారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక ఫండ్ల ద్వారా క్వాంటం, సెమీకండక్టర్ పరిశోధనల నుంచి వచ్చే డీప్-టెక్ స్టార్టప్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. సీఎస్ఐఆర్-సిజిసిఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ బిక్రమ్జిత్ బసు మాట్లాడుతూ, గ్లాస్ మరియు సిరామిక్స్ పరిశోధనా పత్రాల ప్రచురణలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.