అందుబాటు ధరలో హెల్త్కేర్ సేవలు
జనౌషధి ఉత్పత్తుల పరిధి విస్తరణ
న్యూఢిల్లీ:ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు కేవలం సరసమైన మందులనే కాకుండా, విస్తృత స్థాయి ఆరోగ్య సంరక్షణ సాధనాలను కూడా అందుబాటులోకి తెస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 20,000కు పైగా జనౌషధి కేంద్రాల ద్వారా శిశు సంరక్షణ ఉత్పత్తులు, శస్త్రచికిత్స సామగ్రి, మెడికల్ పరికరాలు మరియు వృద్ధుల రోజువారీ సంరక్షణ వస్తువులను తక్కువ ధరలకే అందిస్తూ ఆరోగ్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది.
'జనౌషధి బచ్పన్' పథకం కింద నవజాత శిశువుల కోసం డైపర్లు, వైప్స్ (20 వైప్స్ ప్యాక్ ₹45), ఫీడింగ్ బాటిళ్లు, బ్రెస్ట్ పంపులు తక్కువ ధరకు లభిస్తున్నాయి. అలాగే ప్రసవానంతర సంరక్షణ బెల్టులు, సర్వైకల్ దిండ్లు (₹525), పిల్లల శ్వాసకోశ సపోర్ట్ కోసం నెబ్యులైజర్లు (₹937.50) మరియు మాస్క్లు సబ్సిడీ ధరల్లో లభ్యం అవుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కొలిచే గ్లూకోమీటర్ స్ట్రిప్స్, పల్స్ ఆక్సిమీటర్లతో పాటు వృద్ధుల పరిశుభ్రత, సౌకర్యం కోసం 'జన్ ఔషధి స్వాభిమాన్' పేరుతో ప్రత్యేక అడల్ట్ డైపర్ల శ్రేణిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాబోయే రోజుల్లో ఈ నెట్వర్క్ ద్వారా వాకర్లు, రేంజ్-ఆఫ్-మోషన్ నీ బ్రేస్, మెడికల్ స్టీమ్ వేపరైజర్లు, గర్భవతుల బ్యాక్ సపోర్ట్ బెల్టులు వంటి మరిన్ని పునరావాస పరికరాలను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జీవితంలో ప్రతి దశకు అవసరమైన వైద్యావసరాలను చవకైన ధరల్లో ఇంటి వద్దకే అందించడమే లక్ష్యంగా ఈ విస్తరణ ప్రక్రియ సాగుతోంది.