చెరకు రైతులకు తీపి కబురు
ఎఫ్ఆర్పి బకాయిల చెల్లింపుకు సులభ రుణాలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం
ముంబై: రైతులకు చెల్లించాల్సిన ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ (FRP) బకాయిలను తీర్చేందుకు సహకార చక్కెర మిల్లులకు సులభ రుణాలు (Soft Loans) మంజూరు చేసేందుకు మహారాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 క్రషింగ్ సీజన్ బకాయిలను చెల్లించడంతో పాటు 2026-27 సీజన్ కార్యకలాపాలకు మద్దతుగా నిలిచే ఈ నిర్ణయం వల్ల చెరకు రైతులు, మిల్లు యాజమాన్యాలకు పెద్ద ఉపశమనం లభించనుంది.
దీనితో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 25 ప్రధాన విధానాలు, 25 సంక్షేమ పథకాలను మూల్యాంకనం చేయడానికి 'మహారాష్ట్ర టెక్నికల్ అసిస్టెన్స్ సెల్' (Maha-TAC) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాసిక్లో సాహిత్య పరిషత్ లీజు ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు, వార్ధా జిల్లాలోని అర్వి తాలూకాలో వాణిజ్య సముదాయం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు, మరియు అహల్యానగర్ జిల్లాలోని హరేగావ్ గ్రామంలో వ్యవసాయ కార్పొరేషన్ భూమిని అసలు యజమానులకు తిరిగా అప్పగించేందుకు చట్ట సవరణలతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.