ఇంజనీర్లు కలలను నిజం చేసే కర్మయోగులు
జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ:జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ పురోగతిలో ఆవిష్కరణలు, నూతన నిర్మాణాలు చేపట్టే ఇంజనీర్లు 'కర్మయోగులు' అని కొనియాడారు.
సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా స్పందించిన ప్రధాని, ఇంజనీరింగ్ సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఆలోచనలను స్పష్టమైన విజయాలుగా మార్చడంలో ఇంజనీర్ల పాత్ర అపారమైనదని కొనియాడారు. "ఇంజనీర్లు కేవలం యంత్రాలను నిర్మించరు; అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కలలను నిజం చేసే కర్మయోగులు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య చూపిన బాటలో నడుస్తూ మన ఇంజనీర్లు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు" అని పేర్కొన్నారు.
'ఆధునిక మైసూరు పితామహుడి'గా పేరుగాంచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న జన్మించారు. మైసూరులోని ప్రసిద్ధ కృష్ణరాజ సాగర డ్యామ్ నిర్మాణం, వరద నివారణ వ్యవస్థల రూపకల్పన వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలకుగాను 1955లో భారతరత్న లభించగా, 1968 నుంచి భారత ప్రభుత్వం ఆయన జయంతినైన సెప్టెంబర్ 15ను అధికారికంగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తోంది.