ఆసియా క్రీడల వేళ జపాన్ క్రికెట్ దౌత్యం
భారత్తో చారిత్రాత్మక మ్యాచ్కి సన్నాహాలు
టోక్యో: బేస్బాల్కే అత్యంత ప్రాధాన్యతనిచ్చే జపాన్, క్రికెట్ క్రీడాభివృద్ధికి దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఆసియా క్రీడల నేపథ్యంలో సానో వేదికగా సెప్టెంబర్ 22న బలమైన భారత క్రికెట్ జట్టుతో టీ20 మ్యాచ్ ఆడేందుకు జపాన్ క్రికెట్ అసోసియేషన్ (JCA) ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశమైన భారత్తో జపాన్ తలపడటం చరిత్రలో ఇదే తొలిసారి.
దీని వెనుక జపాన్, భారత ప్రభుత్వాల దౌత్య సంభాషణలు, నిరంతర కృషి ఉన్నాయి. రెండు దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల గుర్తుగా 'సుజుకా కప్' పేరిట ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ప్రధాన జపనీస్ బ్రాండ్ సుజుకి ఈ పోరుకు పూర్తి మద్దతు ఇస్తోంది. ఆసియా క్రీడలలో భాగమైన ఈ క్రికెట్ పోటీలలో భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రధాన జట్లు పాల్గొననున్నాయి.
ప్రస్తుతం జపాన్లో కేవలం 7,300 మంది నమోదిత క్రికెటర్లు, 16 మైదానాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఒక్క టోర్నీతో ఆ దేశంలో క్రికెట్ ప్రజాదరణ ఒక్కసారిగా పెరగకపోవచ్చు కానీ, భారత్తో జరగబోయే ఈ మ్యాచ్ జపాన్ క్రికెట్ చరిత్రలో ఒక నూతన శకానికి నాంది అని జేసీఏ సీఈఓ నవోకి అలెక్స్ మియాజీ స్పష్టం చేశారు.