దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఆరుగురు పిల్లలతో సహా 13 మంది మృతి
బీరూట్: దక్షిణ లెబనాన్లోని పట్టణాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఆరుగురు చిన్నారులతో సహా కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కఫర్ రుమ్మన్ పట్టణంలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడానికి సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఓ పౌర వాహనంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక వైద్యుడు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు.
జూన్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడంతో ప్రాంతీయంగా యుద్ధ మేఘాలు మళ్లీ అలుముకుంటున్నాయి. ఆయుధాలు తరలిస్తున్నారన్న సమాచారంతోనే తాము ఖచ్చితమైన లక్ష్యాలపై దాడి చేశామని, పౌరుల మృతికి సంబంధించిన నివేదికలను సమీక్షిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్ దళాలను లక్ష్యంగా చేసుకుని తమ రెండు డ్రోన్లతో దాడి చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.
మార్చి నుంచి ప్రారంభమైన ఇజ్రాయెల్ సైనిక చర్యలు, వైమానిక దాడుల కారణంగా లెబనాన్లో ఇప్పటివరకు 4,300 మందికి పైగా పౌరులు మరణించగా, అందులో 250 మందికి పైగా చిన్నారులు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ సమాచారం ఇచ్చింది. పౌరులను ఖాళీ చేయమని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండానే ఈ దాడులు జరిగాయని స్థానికులు వాపోతున్నారు.