ఒమన్ తీరానికి సమీపంలో ఎల్ గైయాపై దాడి
అమెరికా, ఇరాన్ల పరస్పర విరుద్ధ వాదనలు
మస్కట్:హోర్ముజ్ జలసంధికి సమీపంలో, ఒమన్ తీరానికి దగ్గరగా పనామా జెండా కలిగిన 'ఎల్ గైయా' అనే చమురు ట్యాంకర్పై జరిగిన దాడికి సంబంధించి అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ దాడికి సంబంధించిన వివరాలపై రెండు దేశాలు ఒకరి వాదనలను మరొకరు తీవ్రంగా ఖండించుకుంటున్నాయి.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) తెలిపిన వివరాల ప్రకారం, జలసంధికి దక్షిణంగా ఉన్న తమ నిషేధిత ప్రాంతం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ ట్యాంకర్ నావికా మైన్ను ఢీకొట్టిందని పేర్కొంది. ఈ ఘటనలో నౌకకు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయిందని, చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలపై తాము ముందే హెచ్చరించామని ఐఆర్జిసి వెల్లడించింది.
అయితే, ఈ వాదనలను యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) పూర్తిగా తోసిపుచ్చింది. గత నెలలోనే ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో సదరు ట్యాంకర్ తీవ్రంగా దెబ్బతిని నిరుపయోగంగా మారిందని తెలిపింది. ఈ వారాంతంలో ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న సమయంలో ఇరాన్ డ్రోన్తో ఆ నౌకపై మరోసారి దాడి చేసిందని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
మరోవైపు, ఆ చమురు ట్యాంకర్ సిబ్బందిలో 14 మంది భారతీయులు ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతయ్యాడని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది.