సౌదీ అరేబియాలో కొత్త భద్రతా హెచ్చరికలు
హౌతీ దాడులతో నౌకా రవాణాపై ఆందోళన
రియాద్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో సౌదీ అరేబియా మరియు కీలక సముద్ర మార్గాలపై ఒత్తిడి తీవ్రమవుతోంది. తాజాగా మక్కా, జెడ్డా, తైఫ్తో పాటు ప్రధాన ఎర్ర సముద్ర చమురు ఓడరేవు యాన్బు సహా ఆరు నగరాల్లో పౌర రక్షణ శాఖ స్వల్పకాలిక అత్యవసర హెచ్చరికలను జారీ చేసి వెంటనే ఉపసంహరించుకుంది. సోమవారం ఖమీస్ ముషైత్, అభా మరియు తైఫ్లపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో 13 మంది పౌరులు గాయపడగా, పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెల్లడించాయి. దేశ రక్షణ కోసం తాము అవసరమైన చర్యలు తీసుకుంటామని సంకీర్ణ దళాలు స్పష్టం చేశాయి.
మరోవైపు యెమెన్లో మానవతా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. ఘర్షణల కారణంగా దేశంలో లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారని, వేలాది మంది బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా జిబూటికి వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితి (UNHCR) ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు భారీగా పడిపోయాయి. సోమవారం ఓ నౌకపై క్షిపణి దాడి జరిగిందని UKMTO నివేదించగా, వాణిజ్య నౌకల ప్రయాణాలు పది నుంచి నాలుగుకు తగ్గాయని షిప్పింగ్ డేటా ట్రాకింగ్ సంస్థ Kpler తెలిపింది. ఈ పరిణామాలతో ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.