P2P లావాదేవీలు, 96% వ్యాపారి చెల్లింపులకు UPI ఉచితం
న్యూఢిల్లీ: కొత్త UPI విధానం అమలులోకి వచ్చినప్పటికీ, వ్యక్తుల మధ్య జరిగే (P2P) అన్ని లావాదేవీలకు UPI సేవలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అలాగే ₹2,000 వరకు ఉండే వ్యాపారి చెల్లింపులపై (P2M) ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) వర్తించదని, జీరో-MDR పరిధిలోకి వచ్చే చిన్న వ్యాపారుల చెల్లింపులు కూడా ఉచితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. దీనివల్ల దేశంలో జరిగే మొత్తం UPI వ్యాపార లావాదేవీలలో దాదాపు 96 శాతం లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.
MDR అనేది వినియోగదారులపై విధించే పన్ను లేదా రుసుము కాదని, కేవలం ₹2,000 కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలపై మాత్రమే 0.4 శాతం మేర వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు UPIని ఎలాంటి పరిమితులు లేకుండా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, బ్యాంకులు లేదా పేమెంట్ యాప్లు అదనపు ఫీజులు వసూలు చేయకుండా ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. అలాగే డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల విస్తరణకు, చిన్న వ్యాపారులలో UPI వినియోగాన్ని ప్రోత్సహించడానికి MDR వసూళ్లలో 5 శాతంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.