ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ.. వినాయక నిమజ్జనంపై అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ అధికారులతో ఎస్పీ స్నేహ మెహ్రా సమీక్ష
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడేందుకు ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, రోడ్డు భద్రత, మహిళలు–చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, వినాయక ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. CCTNS 3.0, Samanvay, Sahyog, TGCOP వంటి సాంకేతిక అప్లికేషన్లను క్షేత్రస్థాయి అధికారులు సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా Property, Cyber, NDPS కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు, NBWలు, Drunk and Drive కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. FSL నివేదికలు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మహిళలు, చిన్నారుల రక్షణపై ప్రత్యేక దృష్టి
మహిళలు, పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎస్పీ స్పష్టం చేశారు. POCSO, SC/ST అట్రాసిటీ, అదృశ్యమైన వ్యక్తుల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుల అరెస్టులు పెండింగ్లో ఉండకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. జిల్లాలో CCTV నిఘాను మరింత విస్తరించడంతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని తెలిపారు.
వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
రానున్న వినాయక ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి వినాయక మండపాన్ని అధికారులు స్వయంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని సూచించారు. నిమజ్జన మార్గాలను ముందుగానే తనిఖీ చేసి రోడ్లపై గుంతలు, విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలు వంటి సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలన్నారు.
నిమజ్జన ప్రదేశాల్లో బారికేడింగ్, లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది, ప్రథమ చికిత్స వంటి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
“ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే మన ప్రధాన లక్ష్యం. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, సమన్వయంతో విధులు నిర్వర్తించాలి. ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేయాలి” అని ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు.
సమావేశంలో DCRB DSP జనయ్య, DSB అధికారులు, వికారాబాద్ DSP అంజయ్య, తాండూర్ DSP N. యాదయ్య, పరిగి DSP శ్రీనివాస్తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.