Sir పేరుతో అధికారులు మాయం.... కార్యాలయాలకు వచ్చి ప్రజలు విలవిల
SIR పేరుతో అధికారులు మాయం.. కార్యాలయాలకు వచ్చి ప్రజలు విలవిల
పనుల కోసం వచ్చిన ప్రజలకు నిరాశే మిగిలింది
తహసీల్దార్, జాయింట్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కోసం పడిగాపులు
బషీరాబాద్, మేజర్ న్యూస్: SIR విధుల పేరుతో అధికారులు కార్యాలయాలకు గైర్హాజరవుతున్నారనే ఆరోపణలు బషీరాబాద్ మండలంలో చర్చనీయాంశంగా మారాయి. తహసీల్దార్, జాయింట్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజూ ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ పనులు, భూములకు సంబంధించిన వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించి చివరకు పనులు కాకుండానే వెనుదిరుగుతున్నారని వాపోతున్నారు.
SIR ప్రక్రియలో అధికారులు విధులు నిర్వహించడం తప్పనిసరైనప్పటికీ, సాధారణ పరిపాలనా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో కార్యాలయాలకు వచ్చిన తర్వాత అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల తమ సమయం, డబ్బు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు అత్యవసరంగా అవసరమయ్యే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోకుండా అధికారులు నిర్దిష్ట సమయాల్లో కార్యాలయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. SIR విధులతో పాటు ప్రజా సేవలకు కూడా ప్రాధాన్యం కల్పించేలా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.