టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: తెల్లవారుజామునే ఒరాకిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్స్.. కారణం అదేనా?
టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉదయాన్నే ఈ-మెయిల్స్ పంపి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐపై భారీ వ్యయాలు, పునర్వ్యవస్థీకరణే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఒరాకిల్లో ఉద్యోగుల కోత.. ఉదయమే ముగిసిన కొలువులు
గ్లోబల్ టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ క్లౌడ్, డేటాబేస్ సేవల సంస్థ ‘ఒరాకిల్’ తాజాగా మరో విడత ఉద్యోగాల కోతకు తెరతీసింది. సోమవారం వేకువజామున సుమారు 6 గంటల సమయంలో కొందరు ఉద్యోగులకు పింక్ స్లిప్ ఈ-మెయిల్స్ పంపి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
లాగిన్స్ కట్.. చేతికి ఉద్వాసన పత్రాలు
సంస్థలోని పలువురు ఉద్యోగులకు ఉదయం నిద్రలేచేసరికే వర్క్స్పేస్ యాక్సెస్, స్లాక్ లాగిన్లు నిలిచిపోయాయి. ఆ వెనువెంటనే యాజమాన్యం నుంచి ఉద్వాసన సమాచారం చేరింది. "కంపెనీ ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణను పరిగణనలోకి తీసుకుని మీ పొజిషన్ను తొలగించాల్సి వచ్చింది. ఈ రోజే మీ ఆఖరి పనిదినం" అంటూ అందులో తేల్చిచెప్పింది. బాధితుల వ్యక్తిగత మెయిల్ ఐడీలకు డాక్యుసైన్ ద్వారా సెవరేన్స్ ప్యాకేజీ వివరాలు పంపుతామని పేర్కొంది.
ఏఐపై ఫోకస్.. ఉద్యోగాలపై వేటు!
ఈ దఫా ఎంతమందిని తొలగించారనే దానిపై ఒరాకిల్ ఎలాంటి అధికారిక సంఖ్యను వెల్లడించలేదు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ మౌలిక వసతుల విస్తరణకు కంపెనీ భారీగా నిధులు వెచ్చిస్తోంది. వార్షిక మూలధన వ్యయాన్ని 90 నుంచి 95 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్న తరుణంలో, వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్గత కార్యకలాపాల్లో ఏఐ ఆటోమేషన్ వాడకం పెరగడం కూడా ఈ కోతలకు దారితీసినట్లు సమాచారం.
గత 2026 ఆర్థిక సంవత్సరంలోనే ఒరాకిల్ దాదాపు 21,000 మందిని (మొత్తం వర్క్ఫోర్స్లో 13 శాతం) తొలగించడంతో ఉద్యోగుల సంఖ్య 1,41,000కు పడిపోయింది. తాజాగా జరిగిన తొలగింపులపై బాధితులు లింక్డ్ఇన్, రెడ్డిట్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.