ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్
సూర్య, రామచంద్రపురం:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గం చూపించడమే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు రామచంద్రపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి నేరుగా వివరించి, పరిష్కారం కోరుతూ మొత్తం 28 అర్జీలు సమర్పించారు. రోడ్లు, డ్రైన్లు, ఇళ్ల స్థలాలు కోరుతూ అర్జీలు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని మంత్రి సుభాష్ శ్రద్ధగా స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ అందరికీ అందుబాటులో ఉండే పాలనకు మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం కృషి చేస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, కంచుమర్తి బాబురావు,రామచంద్రపురం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కూటమి నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆర్జీదారులు పాల్గొన్నారు.