హోర్ముజ్ జలసంధిపై చర్చలు వాయిదా
సౌదీ లక్ష్యాలపై విరుచుకుపడ్డ హౌతీలు
రియాద్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవడంతో ప్రపంచ చమురు సరఫరాకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తీవ్రమయ్యాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఒమన్ వేదికగా ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య సోమవారం జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. సౌదీ అరేబియా అభ్యర్థన మేరకే ఈ సమావేశం వాయిదా పడిందని ఇరాన్ వెల్లడించింది.
ఈ పరిణామాల వేళ, యెమెన్లోని ఇరాన్ మద్దతుగల హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దక్షిణ సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషైత్లోని సైనిక వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ దాడుల్లో 13 మంది పౌరులు గాయపడినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ధృవీకరించాయి.
ఇప్పటికే సౌదీ తూర్పు-పశ్చిమ పైప్లైన్పై దాడి జరగడం, అలాగే ఎర్ర సముద్ర ముఖద్వారం వద్ద ఉన్న పెరిమ్ ద్వీపాన్ని హౌతీలు కైవసం చేసుకోవడంతో సౌదీ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒకేసారి 4% పైగా పెరిగాయి.
మరోవైపు, ప్రత్యక్ష సైనిక జోక్యం కోసం సౌదీ అరేబియా చేసిన విన్నపాలను అమెరికా ప్రస్తుతం పక్కన పెడుతున్నట్లు సమాచారం. ఈ వివాదానికి దూరంగా ఉండాలని అమెరికాను కోరినట్లు హౌతీలు వెల్లడించగా, ఇటు అమెరికా ప్రాంతీయ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్తో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ జెడ్డాలో అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై దాడులకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడుతున్నాయి. పనామా జెండాతో వెళ్తున్న ఒక చమురు ట్యాంకర్ మైన్ దాడికి గురైందని ఇరాన్ సైన్యం ప్రకటించగా, ఆ వార్తను అమెరికా సైనిక కమాండ్ ఖండించింది. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూసివేసి ఉందని, అది తమ నియంత్రణలోనే ఉంతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేశాయి.