క్యాబ్ కోసమే డ్రైవర్ హత్య
హైదరాబాద్: బేగంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. క్యాబ్ను దొంగిలించాలనే ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ముందుగా ప్యాసింజర్లుగా క్యాబ్ను బుక్ చేసుకున్న నిందితులు.. పటాన్చెరు దాటిన అనంతరం డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు.
క్యాబ్లో ప్రయాణిస్తున్న సమయంలో నిందితులు డ్రైవర్ రాజశేఖర్తో సీటు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వైర్తో ఆయన గొంతు బిగించి హత్య చేసినట్లు తేలింది. ముఖంపై కూడా దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం రాజశేఖర్ మృతదేహాన్ని రుద్రారం సమీపంలోని రోడ్డుపక్కన పడేసి నిందితులు క్యాబ్తో పరారయ్యారు.
క్యాబ్ దొంగతనం కోసమే ఈ హత్యకు పన్నాగం పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులు, క్యాబ్ దొంగతనం వెనుక ఉన్న ఉద్దేశాలపై మరింత విచారణ చేస్తున్నారు.