పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. రూ.25 వేలకు పెరగనున్న వేతన పరిమితి!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ప్రస్తుతం ఉన్న పీఎఫ్ వేతన గరిష్ట పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయం వెలువడింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిబంధనల ప్రకారం అమల్లో ఉన్న వేతన పరిమితిని (Wage Ceiling) రూ.15,000 నుంచి రూ.25,000కు సవరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
గతంలో 2014 సెప్టెంబర్లో ఈ వేతన పరిమితిని రూ.15,000కు పెంచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు ద్రవ్యోల్బణం, జీతాల పెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనను మార్చాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ వచ్చాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులకు తప్పనిసరి సామాజిక భద్రత, పీఎఫ్ అలాగే పెన్షన్ (EPS) రక్షణ లభించనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ కొత్త మార్పు అమలులోకి వస్తే, ప్రాథమిక వేతనం రూ.25,000 వరకు ఉన్న ప్రతి ఉద్యోగిని ఈపీఎఫ్ఓ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి అవుతుంది. దీనివల్ల వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న మధ్యతరగతి, వేతన జీవులకు రిటైర్మెంట్ సమయంలో భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి విధివిధానాలు మరియు అమల్లోకి వచ్చే తేదీపై త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. యాజమాన్యాలు తమ పేరోల్ సిస్టమ్ను అప్డేట్ చేసుకునేందుకు తగిన సమయం ఇచ్చేలా కార్యాచరణ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.