బేగంబజార్లో గోల్డ్ ప్లేటెడ్ వినాయక విగ్రహంపై దుమారం.. అసలు నిజం ఇదీ!
హైదరాబాద్ బేగంబజార్లో ఏర్పాటు చేసిన గోల్డ్ ప్లేటెడ్ గణపతి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ వివాదం చెలరేగింది. లక్షల వజ్రాలు, బంగారంతో రూపొందించారంటూ వచ్చిన ప్రచారంలో నిజం లేదని, అది కేవలం కృత్రిమ రంగులని తేలింది.
నగరంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే ప్రతి ఏటా విభిన్న థీమ్స్, వినూత్న అలంకరణలతో ఆకట్టుకునే గణేష్ పండాల్స్ ఈసారి సోషల్ మీడియా వేదికగా ఓ పెద్ద చర్చకు దారితీశాయి. భాగ్యనగరంలోని బేగంబజార్ ఫీల్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం మొదలైంది. ముంబై ప్రసిద్ధ లాల్బాగ్ చా రాజా స్ఫూర్తితో ఈ మండపాన్ని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు.
అయితే ఈ విగ్రహం పూర్తిగా బంగారు పూతతో తయారైందని, దీనిపై లక్షలాది వజ్రాలు పొదిగారంటూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో జోరుగా ప్రచారం చేశారు. ఈ కళ్లుచెదిరే ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ కావడంతో జనం భారీగా తరలివచ్చారు.
అయితే ఈ ప్రచారంపై స్పష్టత రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ విగ్రహానికి ఎలాంటి అసలైన బంగారం లేదా వజ్రాలను ఉపయోగించలేదని తేలింది. కేవలం చూడటానికి ఆకర్షణీయంగా ఉండేందుకు ఆర్టిఫిషియల్ రంగులు, బంగారు పూత ఛాయలతో ఆ రూపం తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి.