ఓపీ జిందాల్ యూనివర్సిటీలో కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం
సోనిపట్:హర్యానాలోని సోనిపట్లో ఉన్న ప్రసిద్ధ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సందర్శించారు. విశ్వవిద్యాలయానికి చేరుకున్న ఆయనకు వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో భాగంగా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో "ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్" (పాలనలో నవకల్పనలు: ఒక స్టార్టప్ రాష్ట్ర కథనం) అనే అంశంపై కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర రూపకల్పన, గత దశాబ్ద కాలంలో సాధించిన అభివృద్ధి, పరిశ్రమలు, సాంకేతిక రంగాలు మరియు పాలనలో తీసుకొచ్చిన నూతన వినూత్న విధానాలను ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, మేధావులతో పంచుకోనున్నారు.