అధికార వర్గంలో అసమ్మతి పోరు...!
పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజీనామా ఆమోదానికి రంగం సిద్ధం
బషీరాబాద్, మేజర్ న్యూస్:
బషీరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో రాజకీయ వేడి రాజుకుంది. పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తూ సీఈఓ వెంకటయ్యకు లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం మండల సహకార రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.తాజా సమాచారం ప్రకారం.. వైస్ చైర్మన్ సమర్పించిన రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో పాలకవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన డైరెక్టర్లు అశోక్, గౌతం, శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి, పాపమ్మ, గోపాల్, అమ్మిరెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించి రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అంతర్గత విభేదాలే కారణమా?
అధికార వర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగానే వైస్ చైర్మన్ రాజీనామా చేసినట్లు మండలంలో చర్చ జరుగుతోంది. అయితే రాజీనామాకు అసలు కారణాలపై సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.రాజీనామా పాలకవర్గం ఆమోదం పొందితే వైస్ చైర్మన్ పదవి ఖాళీ కానుంది. అనంతరం ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే అవకాశం ఉండటంతో పీఏసీఎస్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం బషీరాబాద్ మండల సహకార రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.