ఆస్పత్రిలో పాము... భయాందోళనలో రోగులు
సూర్య వేల్పూరు :
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్ పరిసరాల్లో భారీ పెంజరపాము స్వేచ్ఛగా సంచరిస్తుండటంతో స్థానికులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.పక్కనే వందలాది మంది విద్యార్థులు హాస్టల్ లో నివాసం ఉంటున్నారు. రాత్రి వేళల్లో, పగటి పూట కూడా పాము కనిపిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణీలు సైతం భయంతో వణికిపోతున్నారు.ఈ విషయంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు, ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎవరూ స్పందించలేదని ఆరోపిస్తున్నారు. పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే బాధ్యత ఎవరిది? అధికారులు వెంటనే స్పందించి పామును పట్టుకోవడంతో పాటు, ఆసుపత్రి, హాస్టల్ పరిసరాల్లో శుభ్రత పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.