గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ నిర్ణయాలు గుర్తులు
గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ నిర్ణయాలు గుర్తులు
తండాలకు పంచాయతీ హోదా.. గిరిజనులకు రిజర్వేషన్లు
సంగాయిపల్లి తండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
యాలాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 17): గిరిజనుల సంక్షేమం, తండాల అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండలం సంగాయిపల్లి తండాలో తండావాసులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. తండాలో పుట్టిన బిడ్డకు తన తండానే పంచాయతీ కావాలనే ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించారని పేర్కొన్నారు.
గిరిజనులకు విద్య, ఉపాధి, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు రోహిత్రెడ్డి వివరించారు. అలాగే తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్యాసంస్థల విస్తరణతో పాటు వారి విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. గిరిజనుల కోసం తీసుకున్న నిర్ణయాలు కేవలం పథకాలు మాత్రమే కాదని, వారి ఆత్మగౌరవానికి గుర్తులని రోహిత్రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, రమేష్, రామచంద్రారెడ్డి, విక్రాంత్, నారాయణ, సుక్యా నాయక్, తార్య నాయక్, గణేష్తో పాటు తండావాసులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.