రూ. 1.51 కోట్లతో టేక్కే వ్యవసాయ మార్కెట్ యార్డు సమగ్ర అభివృద్ధి: మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
ఘనంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
రైతులు, వ్యాపారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం
నంద్యాల అర్బన్:నంద్యాల పట్టణంలోని టేక్కే వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని హంగులతో ఆధునీకరించి వ్యాపారులు, రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు . గురువారం నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ల సంఘం అధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని రూ. 151.00 లక్షల (రూ. 1.51 కోట్లు) వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు.
రూ.151 లక్షలతో చేపట్టే ప్రధాన పనులు
ఆఫీస్ భవనం, కాంపౌండ్ వాల్, జి.ఐ షీట్స్ నిర్మాణం
టేక్కే మార్కెట్ యార్డు ముందు భాగమున ఉన్న 20 దుకాణాల (షాపుల) పునర్నిర్మాణం( మరమ్మత్తులు)
యార్డు ఆవరణలో సి.సి. రోడ్లు మరియు కొత్తగా 9 షాపుల నిర్మాణం
ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎండి. ఫరూక్ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు, మార్కెట్ యార్డుల పటిష్టత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరిన షాపులను తిరిగి నిర్మించడంతో పాటు, నూతన దుకాణాలు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా వ్యాపార కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని అన్నారు . నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ రైతులు, వ్యాపారుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డును జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, అడ్వకేట్ రామచంద్రరావు, వైస్ చైర్మన్ దివ్యాల రంగ ప్రసాద్ , కోమలి మధు, మునియార్ ఖలీల్, స్వామి నాయక్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు , పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు, నంద్యాల వ్యవసాయ శాఖ ఏడీఏ తదితరులు పాల్గొన్నారు.