మండుటెండలో విద్యార్థులు... చల్లని నీడలో అధికారులు..!
ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో అధికారుల తీరుపై విమర్శలు
కూర్చీల సౌకర్యం లేక వెనుకవైపు నిలబడిన విద్యార్థులు.. ఎండలోనే సాంస్కృతిక ప్రదర్శనలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 17):వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, వారికి సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
మండుతున్న ఎండలో విద్యార్థులు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించాల్సి వచ్చింది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం చల్లని నీడలో కూర్చొని కార్యక్రమాలను వీక్షించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు
వేడుకలకు హాజరైన విద్యార్థులకు సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు విద్యార్థులు వెనుకవైపు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి ఎండలో నిలబడటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కనీసం తాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యం వంటి ప్రాథమిక ఏర్పాట్లు కల్పించాల్సిన అధికారులు వాటిపై తగిన దృష్టి పెట్టలేదనే ఆరోపణలు వినిపించాయి.
విద్యార్థుల పట్ల ఇదేనా శ్రద్ధ..?
ప్రభుత్వ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వారి ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పుడు, వారి సౌకర్యాలు మరియు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజాపాలన దినోత్సవం వంటి అధికారిక కార్యక్రమంలోనే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.విద్యార్థులకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు తగిన ఏర్పాట్లు, సరిపడా కుర్చీలు, తాగునీరు తదితర సౌకర్యాలు ముందుగానే ఏర్పాటు చేయాల్సిందిగా పలువురు కోరుతున్నారు.