స్టెమ్ సెల్ థెరపీని నియంత్రించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా జారీ
న్యూఢిల్లీ: దేశంలో స్టెమ్ సెల్ థెరపీ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు నిరూపించబడని చికిత్సలను అరికట్టడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సలహాను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నిర్దిష్ట వ్యాధి పరిస్థితులకు మాత్రమే స్టెమ్ సెల్ చికిత్సను ప్రామాణిక సంరక్షణగా అందించాలని స్పష్టం చేసింది.
జనవరి 30, 2026న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు (యష్ ఛారిటబుల్ ట్రస్ట్ కేస్) ఆధారంగా సెప్టెంబర్ 16న ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్-2010 పరిధిలోకి వచ్చే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
ఆటిజం చికిత్స క్లినికల్ ట్రయల్స్కే పరిమితం
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) వంటి వ్యాధులకు స్టెమ్ సెల్స్ వినియోగం కేవలం ఆమోదించబడిన క్లినికల్ ట్రయల్స్కు మాత్రమే పరిమితం కావాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఐసీఎమ్ఆర్ (ICMR), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) సంయుక్తంగా జారీ చేసిన 'నేషనల్ గైడ్లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్, 2017' మార్గదర్శకాలకు లోబడి మాత్రమే ఈ పరి పరిశోధనలు జరగాలని తెలిపింది. ఆమోదించబడిన చట్రం వెలుపల ఆటిజం కోసం వాణిజ్యపరంగా ఈ చికిత్సను అందించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఈ నిబంధనలను ఉల్లంఘించే వైద్యులు, ఆసుపత్రులపై తీవ్ర చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉటంకిస్తూ హెచ్చరించింది. ఐఎంసి రెగ్యులేషన్స్-2002 ప్రకారం ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తనగా పరిగణించబడుతుంది. అలాగే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్లోని సెక్షన్లు 32, 40 కింద ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం మరియు జరిమానాలు విధించడం జరుగుతుంది.
మరోవైపు జాతీయ వైద్య కమిషన్ (NMC) కూడా సెప్టెంబర్ 5న ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, అనధికారికంగా స్టెమ్ సెల్ థెరపీని నిర్వహించడం లేదా ప్రకటనలు ఇవ్వడం నేరమని, ఉల్లంఘనలకు పాల్పడే నమోదిత వైద్యులపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య మండళ్లను ఆదేశించింది.