సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
భద్రతా ఏర్పాట్లపై ఇన్చార్జ్ ఎస్పీ పరితోష్ పంకజ్ సమీక్ష
వికారాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 3): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 4, 5 తేదీల్లో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎస్పీ పరితోష్ పంకజ్.. సీఎం పాల్గొనే కార్యక్రమాల ప్రదేశాలు, ఎడ్యుకేషన్ హబ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణంతో పాటు ఇతర ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, పార్కింగ్, ప్రజల ప్రవేశం, అత్యవసర మార్గాలు తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఐఏఎస్తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ మ్యాప్, ప్రజల రాకపోకలు, హెలిప్యాడ్, సభా ప్రాంగణ భద్రత తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన ఏఎస్ఎల్ రివ్యూ సమావేశంలో పాల్గొన్న ఎస్పీ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, బందోబస్తు విధులు, అధికారుల బాధ్యతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, అధికారులు తమకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజల రాకపోకలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశాల్లో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్, వెంకటాచారి, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఐఎస్డబ్ల్యూ అడిషనల్ ఎస్పీ వాసుదేవ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వారాజ్ గుట్టుర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.