కృత్రిమ మేధ ముప్పు: ఆంథ్రోపిక్ రీసెర్చర్ సంచలన రాజీనామా
సూర్యా న్యూస్ డెస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వేగవంతమైన అభివృద్ధి మానవాళికే పెను ప్రమాలంగా మారుతుందన్న ఆందోళనలు టెక్ రంగంలో కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్లో పరిశోధకుడిగా పనిచేసిన జాకబ్ కాక్సన్ తన ఉద్యోగానికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత మూడేళ్లుగా ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థలలో ప్రీట్రైనింగ్ రీసెర్చర్గా సేవలందించిన ఆయన, ఈ కంపెనీల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టెక్ దిగ్గజాలు భద్రతా ప్రమామాలను పూర్తిగా విస్మరించి, కేవలం స్వయం-అభివృద్ధి చెందే సూపర్ ఇంటెలిజెన్స్ కోసం గుడ్డిగా పరుగులు పెడుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై నియంత్రణ కొరవడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో ఏఐ వ్యవస్థలు మరింత శక్తివంతంగా మారి, ఎలాంటి పనులనైనా సులభంగా చేయగలవని, ఇది మానవ మనుగడకే ముప్పు తెస్తుందని జాకబ్ కాక్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. లాభాపేక్షతోనూ, పోటీ తత్వంతోనూ సాగుతున్న ఈ ప్రయోగాలు ప్రజల ప్రాణాలతో జూదం ఆడటమేనని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఏఐ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు బహిరంగంగా ఒకలా మాట్లాడినా, అంతర్గతంగా మాత్రం ముప్పుపై తీవ్ర భయంతో ఉన్నారని ఆయన వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ టెక్ రంగంలో నైతిక విలువల అమలు మరియు నియంత్రణపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ఏఐ అభివృద్ధిలో వేగం కంటే భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో మానవ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా హెచ్చరికలు టెక్ దిగ్గజాల అంతర్గత విధానాలపై సర్వత్రా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.