రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
ప్రధాని మోదీ హర్షం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ. 20,000 కోట్లకు పైగా విలువైన ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మెరుగైన అనుసంధానం, వేగవంతమైన ప్రయాణికుల రాకపోకలతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని 17 జిల్లాలను కవర్ చేసే ఐదు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 10,021 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా రైల్వే నెట్వర్క్ 540 కిలోమీటర్ల మేర పెరగనుంది. 2029-30 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఐదు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో రైలు సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తాయని, లక్షలాది మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని ప్రధాని ‘X’ ద్వారా తెలిపారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో రూ. 10,783 కోట్ల వ్యయంతో 656 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మూడు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల్లో అదనపు నెట్వర్క్ను పునర్నిర్మించడంతో పాటు వారసత్వ, వన్యప్రాణి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.