ఉక్రెయిన్తో శాంతి చర్చలు త్వరలోనే పునఃప్రారంభం
మాస్కో: ఉక్రెయిన్లో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో జరుగుతున్న శాంతి చర్చలు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వివరాలు వెల్లడించారు.
గత ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ల మధ్య నేరుగా చర్చలేవీ జరగనప్పటికీ, నిలిచిపోయిన ఈ ప్రక్రియను పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధులను మాస్కో, కీవ్లకు పంపారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా పనిచేయడానికి ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ను రూపొందించడం సాధ్యమేనని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలపై పెస్కోవ్ సానుకూలంగా స్పందించారు. శాంతి చర్చల పునఃప్రారంభానికి తమ వైపు నుంచి "ధృవీకరించబడిన రాజకీయ సంకల్పం" ఉందని, అమెరికా ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
మరోవైపు, రష్యా-అమెరికాల మధ్య ఖైదీల మార్పిడి అంశం కూడా ఎజెండాలో నిరంతరం చర్చనీయాంశంగా ఉందన్నారు. గత నెలలో ట్రంప్ అభ్యర్థన మేరకు రాబర్ట్ గిల్మన్ అనే అమెరికన్ ఖైదీని రష్యా విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో మరిన్ని భూభాగాలను వదులుకోవాలన్న మాస్కో డిమాండ్లను ఉక్రెయిన్ తిరస్కరిస్తుండటంతో, పరిష్కారం కనుగొనే విషయంలో ఇరుదేశాల మధ్య ఇంకా వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి.