న్యూఢిల్లీలో 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' ప్రారంభం
800 మందికి పైగా నిపుణులు భేటీ
న్యూఢిల్లీ: మెట్ట వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి, సుస్థిర మార్పులను తీసుకురావడమే లక్ష్యంగా 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్లో వైభవంగా ప్రారంభమైంది. ‘దక్షిణ-దక్షిణ సహకారంతో మెట్ట వ్యవసాయ పరివర్తన’ అనే ఇతివృత్తంతో (Theme) జరుగుతున్న ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఆరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ICAR-ICRISAT భాగస్వామ్యానికి 50 ఏళ్లు పూర్తయిన శుభసందర్భంగా ఈ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు.
సెప్టెంబర్ 10 నుండి 12 వరకు కొనసాగే ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాల నుండి 800 మందికి పైగా శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, రైతులు మరియు అభివృద్ధి భాగస్వాములు హాజరయ్యారు. ప్రపంచ భూభాగంలో 45 శాతం ఉన్న మెట్ట భూములపై ఆధారపడిన రెండు బిలియన్ల ప్రజల జీవనోపాధి, వాతావరణ వైవిధ్యం, నీటి కొరత, భూక్షయం వంటి సమస్యలపై ఇందులో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే నూతన విత్తన పద్ధతులు, వ్యవసాయ సాంకేతికతలు, పోషణ, విపణి లభ్యత, మరియు లింగ సమానత్వం-యువత భాగస్వామ్యం అనే ఆరు కీలక అంశాలపై ప్యానెల్ చర్చలు, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ముగింపు రోజైన సెప్టెంబర్ 12న 'ఐక్యరాజ్యసమితి దక్షిణాది-దక్షిణాది సహకార దినోత్సవం'ను పురస్కరించుకుని CGIAR భాగస్వామ్యంతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సు ముగింపులో మెట్ట వ్యవసాయ భవిష్యత్తు దిశగా 'ఢిల్లీ ప్రకటన (3D)' ఆమోదంతో పాటు నూతన అవగాహన ఒప్పందాలు (MoUs), ప్రతిష్టాత్మక పురస్కారాల ప్రదానం జరగనుంది.