జీ20 సదస్సులో భారత ఇంధన ప్రగతిని వివరించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్
హ్యూస్టన్: జీ20 ఇంధన సమృద్ధి వర్కింగ్ గ్రూప్ సమావేశాలలో పాల్గొన్న కేంద్ర విద్యుత్, గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, భారత్ సాధించిన ఇంధన పురోగతిని ప్రపంచ వేదికపై వివరించారు. దేశంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 552 గిగావాట్లకు (GW) చేరిందని, ఇంధన మిశ్రమంలో శిలాజేతర వనరుల వాటా 50 శాతానికి పైగా ఉందని ఆయన తెలిపారు.
హ్యూస్టన్లో జరిగిన ఈ సదస్సు సందర్భంగా అమెరికా, కెనడా ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్తో సమావేశమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు, అణుశక్తి విస్తరణ రోడ్మ్యాప్పై చర్చించారు. అలాగే కెనడా ఇంధన శాఖ ప్రతినిధి కోరీ హోగన్తో భేటీ అయి ఇంధన సామర్థ్యం, ఆఫ్షోర్ అన్వేషణలలో సహకారంపై మాట్లాడారు. స్వచ్ఛ ఇంధన సాంకేతికతలు, పెట్టుబడుల ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే భారత్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.