రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు
మందుల వినియోగంలో జాగ్రత్తలు, ఆసుపత్రుల్లో సంక్రమణల నివారణ నుంచి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించడం వరకు.. నివారించగల ప్రమాదాలను తగ్గించడంపై దృష్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2026: రోగి ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పటి నుంచి చికిత్స పూర్తయి ఇంటికి వెళ్లి తదుపరి వైద్య పర్యవేక్షణ పొందే వరకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యం ఉండాలనే సందేశంతో కేర్ ఆసుపత్రులు, ఆస్టర్ ఆసుపత్రులు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం–2026ను నిర్వహించాయి. ఇందులో భాగంగా ఇండియా–2 సమూహం పరిధిలోని ఆసుపత్రుల్లో ‘రోగి భద్రత–ఆరోగ్య అవగాహన కార్యక్రమం’ చేపట్టాయి.
సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రోగి భద్రతతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, సక్రమమైన వ్యాధి నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.
ఈ ఏడాది ప్రధాన అంశమైన అసంక్రమిత వ్యాధులకు సురక్షిత వైద్యంకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించారు. వ్యాధులను నివారించడం, ముందుగానే గుర్తించడం, సక్రమంగా నియంత్రించడం, ఆరోగ్యంగా జీవించడం అనే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో రోగుల అవగాహన కోసం వీడియో పోటీలు, ప్రత్యక్ష పాత్రాభినయాలు, నిపుణులతో రెండు నిమిషాల ధ్వని కార్యక్రమాలు, వ్యాధుల నివారణ–ఆరోగ్య పరిరక్షణ అవగాహన కేంద్రాలు, రోగులు తమ అనుభవాలను పంచుకునే కార్యక్రమాలు, నినాదాల పోటీలు, భద్రతా ర్యాలీలు, విభాగాల వారీగా రోగి భద్రతకు సంబంధించిన ఆటలు, గోడపత్రికల పోటీలు నిర్వహించారు. .
మందులను సురక్షితంగా వినియోగించడం, ఆసుపత్రుల్లో సంక్రమణలను నివారించడం, వ్యాధులను సకాలంలో గుర్తించడం, వైద్యులు–రోగుల మధ్య స్పష్టమైన సమాచార మార్పిడి, ఒక వైద్య బృందం నుంచి మరో బృందానికి రోగి వివరాలను సక్రమంగా అందించడం, చికిత్సలో ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించడం, చికిత్సతో పాటు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత పాటించాల్సిన సూచనలను పూర్తిగా అర్థం చేసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్, సమూహం–2 నాణ్యత, రోగి భద్రత విభాగాధిపతి రాజీవ్ చౌరే మాట్లాడుతూ, “రోగి భద్రత అనేది ఒక్క విభాగానికో, ఒక్క వైద్య నిపుణుడికో పరిమితమైన బాధ్యత కాదు. రోగి సంరక్షణలో భాగమైన ప్రతి ఒక్కరూ, ప్రతి దశలోనూ పాటించాల్సిన విధానం. సరైన సమాచారం సరైన సమయంలో సరైన వ్యక్తికి చేరితే అనేక ప్రమాదాలను నివారించవచ్చు” అని అన్నారు.
ఆయన మాట్లాడుతూ, “చికిత్స ప్రారంభమైన తర్వాతే రోగి భద్రత మొదలవుతుందనుకోవడం సరికాదు. వ్యాధి నిర్ధారణ నుంచి మందుల వినియోగం, వైద్య ప్రక్రియలు, ఆసుపత్రి నుంచి ఇంటికి పంపడం, ఆ తర్వాతి వైద్య పర్యవేక్షణ వరకు ప్రతి దశలోనూ భద్రత అవసరం. ఇందులో రోగులు, వారి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎంతో కీలకం. ప్రస్తుతం వాడుతున్న మందులు, అలర్జీలు, గత వైద్య చరిత్రను వైద్యులకు తెలియజేయాలి. ఏదైనా అర్థం కాకపోతే ప్రశ్నించి తెలుసుకోవాలి. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత పాటించాల్సిన సూచనలను స్పష్టంగా తెలుసుకోవాలి. వైద్య బృందం, రోగి, కుటుంబ సభ్యులు కలిసి పనిచేసినప్పుడే రోగి భద్రత మరింత బలోపేతమవుతుంది” అని పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైద్య సేవలు పొందుతున్న ప్రతి పది మంది రోగుల్లో ఒకరు ఏదో ఒక రకమైన హానిని ఎదుర్కొంటున్నారు. ఇందులో సగానికి పైగా ఘటనలను నివారించే అవకాశం ఉంది. అందుకే ఆసుపత్రులు ప్రమాదాలను నిరంతరం గుర్తిస్తూ, వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయడంతో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులను కూడా భద్రతా ప్రక్రియలో భాగస్వాములను చేయడం కీలకం.
మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులకు దీర్ఘకాలిక వైద్య సంరక్షణ అవసరం. తరచూ వైద్యులను సంప్రదించడం, మందులు తీసుకోవడం, పరీక్షలు చేయించుకోవడం, తదుపరి వైద్య పర్యవేక్షణకు వెళ్లడం ఇందులో భాగం. ఈ మొత్తం ప్రయాణంలో చికిత్స కొనసాగింపు, సరైన వైద్య సమాచారం, స్పష్టమైన సమాచార మార్పిడి ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
రోగులు కూడా తమ తాజా వైద్య చరిత్రను అందుబాటులో ఉంచుకోవడం, ప్రస్తుతం వాడుతున్న మందులు, అలర్జీల వివరాలను వైద్యులకు తెలియజేయడం, సూచించిన చికిత్సపై సందేహాలుంటే అడిగి తెలుసుకోవడం, మందుల వినియోగం, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు, తదుపరి వైద్య పర్యవేక్షణకు సంబంధించిన సూచనలను పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా తమ భద్రతలో కీలక పాత్ర పోషించవచ్చని సూచించారు.
రోగి భద్రత అనేది చికిత్స గదికే పరిమితం కాదని, వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు నుంచి చికిత్స, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడం, ఆ తర్వాతి వైద్య పర్యవేక్షణ వరకు ప్రతి దశలోనూ కొనసాగాల్సిన బాధ్యత అని కేర్ ఆసుపత్రులు, ఆస్టర్ ఆసుపత్రులు ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చాయి.