భారత్-చైనా సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు బ్రిక్స్ సదస్సు ఒక వేదిక
రాయబారి విక్రమ్ దొరైస్వామి
బీజింగ్/న్యూఢిల్లీ: సెప్టెంబర్ 12-13 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) నాయకుల శిఖరాగ్ర సమావేశం భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఒక విలువైన అవకాశమని చైనాలోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి అభిప్రాయపడ్డారు. చైనా దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్'లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ పరిరక్షణ, డిజిటల్ రంగం మరియు ప్రజారోగ్యం వంటి కీలక విషయాలలో ఇరు దేశాలు కలిసి పనిచేసే అవకాశం రాబోయే సదస్సు ద్వారా లభిస్తుందని దొరైస్వామి పేర్కొన్నారు. గతంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సందర్భంగా "భారత్, చైనాలు సహకార భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కావు" అని చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత ఈ భాగస్వామ్యానికి ప్రధాన పునాది అని, పరస్పర గౌరవం మరియు సున్నితత్వంతో ఇరు దేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో గత దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన ఆర్థిక వృద్ధిని, 100% విద్యుదీకరణ, డిజిటల్ లావాదేవీల విప్లవం మరియు బ్యాంకింగ్ సేవలు 80 శాతానికి పైగా పెరగడం వంటి విజయాలను ఆయన వివరించారు. కాగా, ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని, భారత్ నేతృత్వంలో ఈ సదస్సును విజయవంతం చేయడానికి సహకరిస్తామని చైనా బుధవారం ప్రకటించింది.