యూఎస్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో యుద్ధం ముగుస్తుంది
డోనాల్డ్ ట్రంప్; పికాక్స్ పర్వతంపై దాడి చేస్తామని హెచ్చరిక
వాషింగ్టన్/టెహ్రాన్: రాబోయే నవంబర్లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో జరుగుతున్న యుద్ధం ముగుస్తుందని తాను ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అత్యంత పటిష్టమైన 'పికాక్స్ పర్వతం' (Picaxe Mountain) స్థావరంపై భారీ రీతిలో దాడి చేస్తామని ఆయన మరోసారి హెచ్చరించారు.
గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ పోరాటంలో ఇరుపక్షాలు నౌకా రవాణాపై విచక్షణారహితంగా దాడులు జరుపుతున్నాయి. బుధవారం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ 10 నౌకలపై దాడులు చేయగా, అంతకుముందు అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ముంచివేసింది. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో సరఫరా మార్గాలకు తీవ్ర విఘాతం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 100 డాలర్ల పైన రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. పెరిగిన ఇంధన ధరల వల్ల అమెరికాలో ట్రంప్ ప్రజాదరణ పడిపోవడంతో, నవంబర్ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఇరాన్ ఇక తట్టుకోలేక యుద్ధాన్ని ముగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, టెహ్రాన్ అణు కార్యక్రమాలను నిరోధించేందుకు ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై సైనిక దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషైత్ వైమానిక స్థావరం, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేయడంతో మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.