యువరాజు రహీం అగా ఖాన్ V తో ప్రధాని మోదీ భేటీ
అభివృద్ధి భాగస్వామ్యం బలోపేతంపై చర్చలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శీయా ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్, యువరాజు రహీం అగా ఖాన్ V తో సమావేశమయ్యారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత మరియు మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో 'అగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్' (AKDN) తో భారతదేశ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఇరునేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ప్రిన్స్ రహీమ్ను కలవడం ఆనందంగా ఉందని, సామాజిక అభివృద్ధి కోసం ఆయన దివంగత తండ్రి, అగా ఖాన్ IV చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నానని తెలిపారు. తన తండ్రి, ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ అగా ఖాన్ IV మరణానంతరం ఫిబ్రవరి 2025లో ఇస్మాయిలీ సమాజానికి 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్స్ రహీమ్, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు భారతదేశంలో వారం రోజుల పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి చేరుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్తో భేటీ అయి, సామాజిక అభివృద్ధి మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో AKDN చేపడుతున్న పలు ప్రాజెక్టులపై చర్చించారు. సెప్టెంబర్ 15 వరకు కొనసాగే ఈ పర్యటనలో యువరాజు రహీమ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షా లతో సమావేశం కానున్నారు. అలాగే అహ్మదాబాద్, ముంబై మరియు హైదరాబాద్ నగరాలలో పర్యటించి, AKDN ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.