భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు
ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 12, 13 తేదీలలో రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ప్రతిష్టాత్మక BRICS శిఖరాగ్ర సదస్సు 2026కు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనుండగా, విదేశీ అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.
ఈ అంతర్జాతీయ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్లతో పాటు బెలారస్, కజకిస్తాన్, మలేషియా, థాయ్లాండ్ ప్రభుత్వాధినేతలు విచ్చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తుండగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతంలో ఐదు దేశాలతో నడిచిన ఈ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, అలాగే 2025లో ఇండోనేషియా చేరడంతో ప్రస్తుతం 11 పూర్తిస్థాయి సభ్య దేశాల మహా కూటమిగా ఇది అవతరించింది. విదేశీ ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో భద్రత నిమిత్తం ఢిల్లీ పోలీసులు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విఐపి కాన్వాయ్ల కదలికలకు అనుగుణంగా ప్రయాణ మార్గాల్లో తాత్కాలిక మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు సెప్టెంబర్ 12న "సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం" అంశంపై సభ్య దేశాల నేతలతో అంతర్గత సమావేశం జరగనుంది. అనంతరం 'భారత్ ఇన్నోవేట్స్' ప్రదర్శన వీక్షించి, ఉమ్మడి మొక్కల పెంపకం, అధికారిక విందులో పాల్గొంటారు. రెండో రోజు సెప్టెంబర్ 13న భాగస్వామ్య దేశాల నేతలతో కలిసి “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం” అనే అంశంపై విస్తృత స్థాయి ప్రధాన చర్చా సదస్సు కొనసాగనుంది.