ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం
ఫెర్రీలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 80 మందికి పైగా గల్లంతు
మనీలా: పశ్చిమ ఫిలిప్పీన్స్లోని పలవాన్ ద్వీపం సమీపంలో ఒక ఫెర్రీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా, 80 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకున్నట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ (PCG) గురువారం వెల్లడించింది.
మనీలాలోని బేసెకో ప్రాంతం నుండి కొరోన్ వైపు వెళ్తున్న 'ఎంవి జూన్ ఆస్టర్' (MV June Aster) అనే ప్రయాణికుల నౌక పలవాన్లోని కొరోన్ సముద్ర జలాల్లోకి చేరుకోగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా విస్తరించిన మంటలు నౌకలోని కొన్ని భాగాలను పూర్తిగా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బుధవారం రాత్రి నాటికి 43 మందిని సురక్షితంగా రక్షించారు.
నౌకలోని ప్రయాణీకుల జాబితా ప్రకారం ఘటన సమయంలో మొత్తం 117 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నారని కోస్ట్ గార్డ్ ప్రతినిధి కమోడోర్ నోమీ కయాబ్యాబ్ తెలిపారు. ప్రస్తుతం బతికి బయటపడిన వారు, మరణించిన వారి గణాంకాల ఆధారంగా దాదాపు 80 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉందన్నారు. సముద్రంలో సహాయక, రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, బాధితుల సంఖ్య మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.