అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి 1891 చట్టం స్థానంలో నూతనంగా రూపొందించిన ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. న్యాయపరమైన విచారణలలో బ్యాంకింగ్ రికార్డులను సాక్ష్యంగా సమర్పించే విధానాన్ని ఆధునీకరిస్తూ రూపొందించిన ఈ చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
వేగంగా మారుతున్న డిజిటల్ సాంకేతికతకు అనుగుణంగా భౌతిక రికార్డులతో పాటు ఎలక్ట్రానిక్, డిజిటల్, క్లౌడ్ ఆధారిత డేటాను కూడా చట్టబద్ధంగా గుర్తించనున్నారు. మాన్యువల్ మరియు డిజిటల్ సంతకాల ద్వారా రికార్డుల ధృవీకరణను సులభతరం చేశారు. అలాగే బ్యాంకు నేరుగా పక్షంగా లేని విచారణలలో అధికారులను పిలిపించే ముందు కోర్టులు ప్రత్యేక కారణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం (Ease of Doing Business) మరియు ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది.