పెరిగిన ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయంగా బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటిన ముడిచమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా 38.07 పాయింట్లు పెరిగి 74,809.95 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.85 పాయింట్ల లాభంతో 23,439.20 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 కంపెనీలలో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్, ఐటీసీ, ఇన్ఫోసిస్ లాభపడగా.. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్ నష్టపోయాయి.
ప్రపంచ చమురు బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ 0.20 శాతం తగ్గి బ్యారెల్కు 101 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా, యూఎస్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగగా, బుధవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) రూ. 582.99 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరియు యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.